గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో జాబ్ ఈ ఏడాది జాబ్ కట్స్ ఉంటాయనే సంకేతాలు పంపారు. మరోవైపు కంపెనీలు పనిభారాలను తగ్గించుకునేందుకు ఏఐ సాఫ్ట్వేర్, ఆటోమేషన్ వైపు మళ్లుతున్న క్రమంలో కొలువుల కోతపై ఆందోళన నెలకొన్న నేపధ్యంలో సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది ఉద్యోగుల కుదింపు తరహాలో ఈసారి తొలగింపులు ఉండవని, ప్రతి టీమ్లోనూ లేఆఫ్స్ ప్రభావం ఉండదని ఉద్యోగులకు పంపిన మెమోలో పిచాయ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్ధేశించుకున్నామని, అందుకు అనుగుణంగా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. కాగా వాయిస్ అసిస్టెంట్ యూనిట్స్, పిక్సెల్, నెస్ట్, ఫిట్బిట్, యాడ్ సేల్స్ టీంకు సంబంధించిన హార్డ్వేర్ టీంకు చెందిన పలువురు ఉద్యోగులను తొలగించనున్నట్టు గతవారం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అగ్మెంటెడ్ రియాలిటీ విభాగంలోనూ ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు టెక్ దిగ్గజం వెల్లడించింది.
0 Comments