Ad Code

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ నిధులు విడుదల !


ఆంధ్రప్రదేశ్ లో గత రెండు నెలలుగా వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక పెన్షన్లు ఎప్పుడొస్తాయా అని పెన్షన్లర్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అలాగే ఈసారి ఇంటి వద్ద ఇస్తారా లేక సచివాలయాలకు వెళ్లాలా, బ్యాంకులకు వెళ్లాలా అన్న టెన్షన్ కూడా ఉండేది. అయితే అప్పట్లో ఎన్నికల కారణాలతో చివరి నిమిషం వరకూ ఈ టెన్షన్ ను కొనసాగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం పెన్షన్లను సకాలంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ నిధుల్ని విడుదల చేసింది. రాష్ట్రంలో మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం రూ.1939.35 కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ ఇవాళ ప్రకటించారు.ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. మే నెలకు సంబంధించి 65,30,808 పెన్షన్లలో 47,74,733 పెన్షన్లు (73.11 శాతం) ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పద్ధతి ద్వారా 17,56,105 పెన్షన్లు (26.89శాతం) డోర్-టు-డోర్ పంపిణీ పద్ధతి ద్వారా చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. పెన్షన్‌దారుల బ్యాంక్ ఖాతాల్లోకి జూన్ 1, 2024 న నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సొమ్ము జమ చేస్తామన్నారు. ఇంటి వద్ద పెన్షన్ అందజేసేలా పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు సంబంధిత బ్యాంకు శాఖల నుండి మే 31న పెన్షన్ నగదును డ్రా చేసి, పెన్షన్లను పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్న ఇతర గ్రామ, వార్డు కార్యాలయ సిబ్బందికి అప్పగించాలని ఆదేశించారు. సదరు సిబ్బంది 1 జూన్ నుండి 5 జూన్ వరకు డోర్-టు-డోర్ పంపిణీ చేయాలని సూచించారు.ఈ మేరకు ఈసీ ఆదేశాల ప్రకారం మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.

Post a Comment

0 Comments

Close Menu