Ad Code

ఓఆర్‌ఆర్‌పై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి మహిళ దుర్మరణం !


హైదరాబాద్‌లోని నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆదివారం రాత్రి ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడి ఒకరు మృతి చెందగా 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్‌ మితిమీరిన వేగంతో బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని నార్సింగి పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒంగోలుకు చెందిన మమత (33) బస్సు కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. గాయపడిన ఇతర ప్రయాణికులను చికిత్స కోసం నానక్‌రాంగూడలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని మద్యం మత్తు పరీక్ష నిర్వహించగా 197 వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ అతిగా మద్యం తాగినట్లు అర్థమవుతోంది. హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరి వెళ్లాల్సిన మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు గచ్చిబౌలి నుంచి బయలుదేరిన 15 నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. బస్సులో 18 మంది ప్రయాణికులున్నారు. నార్సింగి అలేఖ్య రైజ్‌ టవర్స్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సు 150 కి.మీ. వేగంతో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. వర్షం వల్ల రహదారి తడిగా ఉండటం, మలుపు తీసుకునే క్రమంలో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అతి వేగం కారణంగా డివైడర్‌ను దాటి పక్క రహదారిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. కిటికీ అద్దాలు పగిలి మమత అనే మహిళ కింద పడ్డారు. ఆమెపై బస్సు పడటంతో చనిపోయారు. మిగతా ప్రయాణికులకు తలకు, చేతులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలిని రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ పరిశీలించారు. రహదారిపై అడ్డంగా బస్సు బోల్తా పడటంతో అప్పా కూడలి నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనాలను కొన్ని గంటలసేపు దారి మళ్లించారు.

Post a Comment

0 Comments

Close Menu