Ad Code

సెల్‌ఫోన్‌ చోరీ ముఠా అరెస్టు !


హైదరాబాద్‌ నగరంలో కరడుగట్టిన సెల్‌ఫోన్‌ చోరీ ముఠాను సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 19న అర్ధరాత్రి చోరీలతో భయానక వాతావరణం సృష్టించిన మసూద్‌ ఉర్‌ రెహమాన్‌, ఫజల్‌ ఉర్‌ రెహమాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి ద్విచక్రవాహనం, మారణాయుధాలు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మసూద్‌పై గతంలో నాచారం, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడు మసూద్‌ విలాసాలకు అలవాటుపడి చోరీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే తరహా కేసుల్లో గతంలో అరెస్టయినట్టు తెలిపారు. ఈనెల 19న బంధువుల ఇంటికి వచ్చిన మసూద్‌ స్నేహితుడైన ఫజల్‌కి ఫోన్‌ చేశాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి చాదర్‌ఘాట్‌ వైపు వెళ్లి అక్కడ రోడ్డుపై ఉన్న ద్విచక్రవాహనాన్ని చోరీ చేశారు. దాన్ని మలక్‌పేటలోని స్వాగత్‌ హోటల్‌ వద్ద పార్క్‌ చేసి రాత్రి 2.30గంటల సమయంలో సికింద్రాబాద్‌ వైపు వెళ్లారు. గణేష్ ఆలయం సమీపంలో స్టేషన్‌వైపు వెళ్తోన్న ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్‌ చోరీ చేసేందుకు ప్రయత్నించగా.. అతను అడ్డుకున్నాడు. వారి వద్ద ఉన్న కత్తితో బెదిరించి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లారు. వెళ్లే క్రమంలో అక్కడున్న వారికి కత్తులు చూపిస్తూ భయానక వాతావరణం సృష్టించారు. అక్కడ బాధితుడు సాయం కోసం కేకలు వేయడంతో రంగంలోకి దిగిన యాంటీ స్నాచింగ్‌ టీమ్‌ నిందితులను వెంబడించింది. ఇద్దరు కానిస్టేబుళ్లు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదే క్రమంలో మరో చోరీ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో నిందితులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బులెట్‌ నిందితుడు మసూద్‌ కాలిలో దిగింది. దీంతో పరారైన నిందితుల కోసం గాలించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి 48 గంటల్లో పట్టుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu