Ad Code

అంకెల గారడీ తప్ప బడ్జెట్‌లో ఏమి లేదు : కిషన్ రెడ్డి !


తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. అభూత కల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్‌లో ఏం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని అన్నారు. ప్రతి ఏడాది రైతులకు సీజన్‌ ముందు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయానికి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని అన్నారు. బడ్జెట్‌ మొత్తంలో ఆసరా పెన్షన్ల ప్రస్తావనే లేదని కిషన్‌ రెడ్డి అన్నారు. పింఛన్లు పెంచుతామని మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. కానీ బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. దళిత సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ.21,072 కోట్ల నుంచి రూ.7,638 కోట్లు తగ్గిపోయిందని, గిరిజన సంక్షేమం కోసం కేటాయించాల్సిన బడ్జెట్ రూ. 4,365 కోట్ల నుంచిరూ. 3,969 కోట్లకు తగ్గిపోయిందని తెలిపారు. మొత్తం ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదు.. కానీ మైనారిటీల సంతుష్టీకరణ మాత్రమే మాకు కావాలనే కాంగ్రెస్ ఆలోచన మరోసారి ఈ బడ్జెట్‌లో బట్టబయలైందని అన్నారు. 2023-24లో రూ.2వేల కోట్లుగా ఉన్న మైనార్టీ సంక్షేమ నిధులను.. ఈ బడ్జెట్‌లో ఏకంగా రూ.3,003 కోట్లకు పెంచారు. అంటే ఒక్క ఏడాదిలోనే 30% కోటా బడ్జెట్ పెంచేశారని తెలిపారు. మహిళలకు డ్వాక్రా రుణాలు ఇస్తామని గొప్పగా ప్రస్తావించారని.. కానీ అది ఇప్పటికే ఉన్నదని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు అన్నారని.. దాని ఊసే లేదని మండిపడ్డారు. విద్యా నిధి పథకం కింద రూ.5 లక్షల సాయం చేస్తామన్నారని.. దాని ప్రస్తావన కూడా లేదన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.. అదీ లేదని పేర్కొన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని కిషన్‌ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలేమిటో నిధులు ఎలా సమకూర్చుకుంటారో ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించలేదని కిషన్‌ రెడ్డి అన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu