Ad Code

గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో పేషెంట్‌ను కాల్చిచంపిన ఆగంతకుడు


న్యూఢిల్లీలోని గురు తేజ్ బహదూర్  ఆసుపత్రిలో ఆదివారంనాడు 24వ వార్డులోకి ప్రవేశించిన ఒక టీనేజర్ చికిత్స పొందుతున్న రియాజుద్దీన్ (32) అనే వ్యక్తిని కాల్చిచంపి వెంటనే పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రియాజుద్దీన్‌ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వార్డులో కాల్పుల ఘటనపై జీటీబీ ఎంక్లేవ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారని, అప్పటికే తీవ్రంగా గాయపడిన రియాజుద్దీన్ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని డిసీపీ సురేంద్ర చౌదరి తెలిపారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 18 ఏళ్ల యువకుడు వార్డులోకి వచ్చాడని, రియాజుద్దీన్‌పై వెంటనే కాల్పులు జరిపాడని తెలిపారు. కేసు నమోదు చేసి ఆగంతకుని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని పంపినట్టు చెప్పారు. వ్యక్తిగత కక్షలే ఈ కాల్పులకు కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని అన్నారు. కాగా, ఢిల్లీలోని ఖజూరిలో ఉంటున్న రియాజుద్దీన్ పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్‌తో జూన్ 23న ఆసుపత్రిలో చేరాడు.

Post a Comment

0 Comments

Close Menu