Ad Code

రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ !


తెలంగాణలోని రామగుండంలో మూతపడ్డ బీ పవర్​ హౌస్​ 62.5 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ స్థానంలో 800 మెగావాట్ల పవర్​ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్​ ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్​కో జాయింట్​గా పవర్​ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. అతి త్వరలోనే పవర్​ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని, భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈరోజు రామగుండంలో మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​తో కలిసి పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీ పవర్​ హౌస్‌​ను పరిశీలించారు. ఈ క్రమంలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా అధికారులు బీ పవర్​ హౌస్​ గురించి మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ చారిత్రాత్మకమైన పవర్​ ప్రాజెక్టు 50 ఏళ్ల క్రితం ఏర్పడి ఈ ప్రాంతానికి వెలుగునిచ్చిందని తెలిపారు. సాగునీటిని కూడా తీసుకువచ్చిన ప్రాజెక్టు కాలం చెల్లడంతో మూసివేసే పరిస్థితికి వచ్చిందని అయన అన్నారు. భావోద్వేగమైన పరిస్థితులతో ముడిపడి ఉన్న పవర్​ ప్రాజెక్టుపై సీఎం రేవంత్​ రెడ్డితో ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు చర్చించామని తెలిపారు. ఈ క్రమంలో 800 మెగావాట్ల విద్యుత్​ పవర్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి, జెన్‌​కో సంయుక్త వెంచర్​గా పవర్​ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu