Ad Code

హిండెన్ బర్గ్ ఆరోపణలు స్వార్థపూరితం !

మెరికా షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవాలు, చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరి బచ్, ఆమె భర్తకు.. విదేశాల్లో అదానీ గ్రూప్ అనుబంధ సంస్థల్లో షేర్లు ఉన్నాయని హిండెన్ బర్గ్ తాజా ఆరోపణల సారాంశం. నిరాశాపూరిత వాతావరణంలో భారతీయ చట్టాలను పూర్తిగా ధిక్కరిస్తూ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ పేర్కొంది. 'అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా పదేపదే హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేస్తున్న నిరాధార ఆరోపణలను మేం పూర్తిగా తిరస్కరిస్తున్నాం. ఈ సంస్థ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని దర్యాప్తులో రుజువైంది. గత జనవరిలో సుప్రీంకోర్టు కూడా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చింది' అని అదానీ గ్రూప్ తన ప్రకటనలో తెలిపింది. తమ విదేశీ కంపెనీలు పూర్తిగా పారదర్శకంగా పని చేస్తున్నాయని పేర్కొంది. గతంలో అదానీ గ్రూపు కంపెనీల్లో అనిల్ అహుజా నామినీ డైరెక్టర్ గా ఉన్న మాట నిజమే అయినా, ప్రస్తుతం ఆయనతో గానీ, ఇతర వ్యక్తులతో గానీ ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవని అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది. ప్రభుత్వ, నియంత్రణ సంస్థల నిబంధనలకు కట్టుబడి పూర్తి పారదర్శకతతో పని చేస్తున్నామని వివరించింది. వినోద్ అదానీ సారధ్యంలో బెర్ముడా, మారిషస్ దేశాల్లో నిర్వహిస్తున్న సంస్థల్లో సెబీ చైర్ పర్సన్ మాదాబి బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్ లకు దాదాపు రూ.83 కోట్ల విలువైన వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ప్రజా వేగుతోపాటు ఇతర సంస్థల దర్యాప్తు నివేదికల ఆధారంగానే తాము స్పందిస్తున్నట్లు తెలిపింది. అదానీ గ్రూప్ తమ కంపెనీల స్టాక్స్ విలువ కృత్రిమంగా పెంచుకోవడానికి అవకతవకలకు పాల్పడుతూ, కంపెనీ ఖాతాల్లోనూ మోసాలు చేస్తున్నదని గతేడాది జనవరిలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక బయట పెట్టింది. దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 150 బిలియన్ డాలర్ల మేరకు కోల్పోయినా.. తిరిగి యధాతథ స్థితికి వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu