Ad Code

ప్రకృతి విపత్తుతో అల్లకల్లోలమైన రాష్ట్రానికి అండగా నిలిచేందుకు జీతాలు వద్దనుకున్న సీఎం, మంత్రులు !


హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి విపత్తుతో అల్లకల్లోలమైన రాష్ట్రానికి అండగా నిలిచేందుకు సీఎం, మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల పాటు జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అందులో చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు భాగంకానున్నారని  ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అల్లకల్లోలమైంది. ఆగస్టు నెలలో కులు, మండి, శిమ్లా జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. జూన్‌ 27 నుంచి ఆగస్టు 9 మధ్యలో 100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్‌లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. దాంతో రోజువారీ కార్యకలాపాలతో పాటు పర్యటకంపై ప్రభావం పడింది. గత ఆగస్టులో కూడా హిమాచల్ ప్రదేశ్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించిందని అప్పట్లో సీఎం వెల్లడించారు. ఈ విలయంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాష్ట్రానికి గత ఏడాది, ఈసారి కేంద్రం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. విపత్తు అనంతరం పునర్నిర్మాణం కింద రూ.9వేలు కోట్లు అవసరమవుతాయని ఈరోజు అసెంబ్లీలో సుఖు వెల్లడించారు. కేంద్రం ఇంకా నిధులు విడుదల చేయలేదని చెప్పారు. 68 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40, భాజపాకు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu