Ad Code

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు !


యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 'స్పీడ్' ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీఎస్‌ శాంతి కుమారి, మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేశ్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హెల్త్‌ టూరిజంను అభివృద్ధి చేయాలన్న రేవంత్‌ రెడ్డి, హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు సమర్పించాలన్నారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులను అర్ధాంతరంగా ఆపవద్దని స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

Post a Comment

0 Comments

Close Menu