Ad Code

రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నేతలు నిర్ణయం !

                                       

తెలంగాణ వరద బాధితుల సహాయానికి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన తర్వాత, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ డబ్బును వరద సహాయక చర్యలకు వినియోగించనున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్‌ వైస్‌ చెర్‌పర్సన్‌లు, సలహాదారులందరూ తమ రెండు నెలల వేతనాన్ని విరాళంగా అందజేస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్‌బాబు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించింది. రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ నివేదిక తెలిపింది. రోడ్లు భవనాల శాఖ పరిధిలో రూ.2,362 కోట్లు, విద్యుత్ శాఖ పరిధిలో రూ.175 కోట్లు, పంటలు రూ.415 కోట్లు, నీటిపారుదల శాఖ పరిధిలో 629 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్థి, తాగునీటి శాఖ పరిధిలో రూ.170 కోట్లు, మున్సిపల్ శాఖ పరిధిలో రూ.1,150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం తన నివేదికలో పొందుపరిచింది. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది.

Post a Comment

0 Comments

Close Menu