Ad Code

తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే భారత్ ఆలౌట్ !


బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌటైంది. ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ కావడం గమనార్హం. ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. రిషభ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) కాసేపు పోరాడారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ తీశాడు. గత రెండు రోజులుగా వర్షం పడటంతో పిచ్ బౌలర్లకు మంచి సహకారం అందించింది. ఆరంభం నుంచే కివీస్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (2), యశస్వి జైస్వాల్ (13) ఆచితూచి ఆడారు. దాదాపు ఆరు ఓవర్లపాటు వికెట్ ఇవ్వలేదు. కానీ, రోహిత్ ఎటాకింగ్‌ చేసి కివీస్‌ బౌలర్లను దెబ్బ కొడదామని భావించాడు. కానీ, సీనియర్‌ బౌలర్ సౌథీ ఇన్‌స్వింగర్‌తో రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (0), సర్ఫరాజ్‌ ఖాన్ (0) కివీస్‌ ఫీల్డర్ల దెబ్బకు పెవిలియన్‌కు చేరక తప్పలేదు. వారు ఇచ్చిన క్యాచ్‌లను అద్భుతంగా ఒడిసిపట్టారు. రిషభ్‌ పంత్ (20)తో కలిసి యశస్వి జైస్వాల్ వికెట్‌ పతనాన్ని అడ్డుకొన్నాడు. దాదాపు 11 ఓవర్లపాటు వికెట్‌ ఇవ్వలేదు. అయితే, యశస్వి ఏకాగ్రత కోల్పోయి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత భారత ఇన్నింగ్స్‌ కుప్పకూలడానికి మరింత సమయం పట్టలేదు. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో సిరాజ్ (4*) బౌండరీ కొట్టాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో ఇది నాలుగో బౌండరీ మాత్రమే. రిషభ్‌ 2 కొట్టగా.. ఒకటి యశస్వి బ్యాట్‌ నుంచి వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu