Ad Code

కలుషిత నీళ్లు తాగి ఇద్దరు మృతి !


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సంజీవరావుపేట గ్రామంలోని బీసీ కాలనీ ప్రజలు శనివారం పండుగ రోజు యథావిధిగా బావి నుంచి నీరు తీసుకుని తాగారు. తాగిన వారిలో దాదాపు 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి గమనించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. వారు తాగిన నీరు కలుషితమైందని వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమించి మహేశ్‌ (22), సాయమ్మ (70) మరణించారు. ఆస్పత్రికి తరలించే లోపే వారిద్దరూ మృతి చెందారని వైద్యులు తెలిపారు. కాగా మరింత మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులంతా ఆస్పత్రి బాట పడుతున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన బావిని అధికారులు పరిశీలించారు. బావిలోని నీటి నమూనాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో బావి నీళ్లు ఎవరూ తాగవద్దని అధికారులు ప్రకటించారు. పండుగ రోజే రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. చేతికొచ్చిన యువకుడు మహేశ్‌ మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఇరు కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కాగా ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్‌ ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. తాము అమలుచేసిన మిషన్‌ భగీరథను సక్రమంగా అమలు చేయకపోవడంతోనే ప్రజలు బావిలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. వెంటనే మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే మిషన్‌ భగీరథ కింద ఇంటింటికి రక్షిత తాగునీరు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu