మహారాష్ట్ర లోని కొల్హాపూర్లో శనివారంనాడు జరిగిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, దేశంలోని వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని, ప్రజలను భయపెడుతూ, రాజ్యాంగాన్ని, ఆయా సంస్థలను నాశనం చేస్తూ ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఎదుట తలవంచి నమస్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజం ఉండదని అన్నారు. ఇటీవల సింధుదుర్గ్ జిల్లా రాజ్కోట ఫోర్ట్లోని 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాహుల్ తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ 2023 డిసెంబర్ 4న రాజ్కోట ఫోర్ట్లోని శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, భారీ వర్షాలతో గత ఆగస్టు 6న ఆ విగ్రహం కూలిపోవడం రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ ఘటన అనంతరం గత ఆగస్టులోనే మహారాష్ట్రలో పర్యటించిన సందర్భంగా శివాజీ విగ్రహం ఘటనపై ప్రధాని క్షమాపణలు చెప్పుకున్నారు. ఛత్రపతి శివాజీ అంటే ఒక పేరో, రాజో కాదని, తమకు దైవమని అన్నారు. ఈరోజు ఆయనకు తలవంచి క్షమాపణలు చెప్పుకుంటున్నానని అన్నారు. కాగా, కొల్హాపూర్లో శివాజీ విగ్రహావిష్కరణకు వచ్చిన రాహుల్ గాంధీ పరోక్షంగా ఇటీవల కూలిన శివాజీ విగ్రహాన్ని ప్రస్తావిస్తూ, శివాజీ సందేశం దేశప్రజలందరికీ వర్తిస్తుందన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజు, షాహు మహారాజ్ వంటి వీర యోధులు లేకుంటే అసలు రాజ్యాంగమే ఉండేది కాదని అన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని, కీలక సంస్థలను బీజేపీ ప్రభుత్వం నీరు గారుస్తోందని ఆరోపించారు.
0 Comments